తిలక్‌ వర్మ జట్టును వీడాడు.. పరాజయాల పరంపరతో.. | TG20 League 2026: Khammam Aces Beat Medak Falcons | Sakshi
Sakshi News home page

ఖమ్మం జయభేరి.. ఓటమితో మెదక్‌ నిష్క్రమణ

Jul 6 2026 6:25 PM | Updated on Jul 6 2026 6:53 PM

TG20 League 2026: Khammam Aces Beat Medak Falcons

ఓటమితో మెదక్‌ నిష్క్రమణ

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌ నుంచి మెదక్‌ ఫాల్కన్స్‌ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది.

కాగా సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో మెదక్‌ సంచలన విజయం సాధించింది. వరంగల్‌ వారియర్స్‌ విధించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ తిలక్‌ వర్మ మెదక్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. సెంచరీ (56 బంతుల్లో 136 నాటౌట్‌) బాది జట్టును గెలిపించాడు.

తిలక్‌ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా..
ఆ తర్వాత తిలక్‌ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా.. మెదక్‌ పరాజయాల పరంపర కొనసాగింది. గెలుపున్నదే లేక చతికిల పడిన మెదక్‌.. లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. అయితే, సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన మెదక్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

ఆకాశమే హద్దుగా
ఆరంభంలోనే ఓపెనర్లలో జీఎస్‌కే రెడ్డిని డకౌట్‌ చేయడం సహా వాఫీ కచ్చి (14)ని కూడా త్వరగానే పెవిలియన్‌కు పంపి కెప్టెన్‌ రవితేజ శుభారంభం అందించాడు. మికిల్‌ జైస్వాల్‌ (15) అర్జున్‌ పెవిలియన్‌కు చేర్చగా ఖమ్మం ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ కొడిమెల హిమతేజ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులతో హిమతేజ అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ప్రతీక్‌ రెడ్డి (32) రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మెదక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది.

శుభారంభం అందించినా..
ఓపెనర్లు నమన్‌ అగర్వాల్‌ (19 బంతుల్లో 32), శృంజిత్‌ రెడ్డి (46 బంతుల్లో 60) శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ రవితేజ డకౌట్‌ కాగా.. విక్రమ్‌ నాయక్‌ (7), వరుణ్‌ యర్రం (0) తీవ్రంగా నిరాశపరిచారు.

ఇక సూర్య తేజ (19 బంతుల్లో 26), ఇషాన్‌ శర్మ (15 బంతుల్లో 34 నాటౌట్‌) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఫలితంగా మెదక్‌ 19 పరుగుల తేడాతో ఓడిపోయి భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

మరోవైపు.. ఖమ్మం ఈ విజయంతో ఐదో గెలుపు నమోదు చేసి పది పాయింట్లతో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఇక మెదక్‌తో మ్యాచ్‌లో ఖమ్మం బౌలర్లు హర్షిత్‌ సాయి, విద్యానంద రెడ్డి, వాఫీ కచ్చీ తలా రెండు వికెట్లు తీయగా.. వేద్‌రెడ్డికి ఒక వికెట్‌ దక్కింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement