T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..

T20 WC 2022: Sreesanth On Paddy Upton Dont Think He Can Do Wonders - Sakshi

ICC T20 World Cup 2022: టీమిండియా మెంటల్‌ కండిషనింగ్‌ హెల్త్‌కోచ్‌గా నియమితుడైన ప్యాడీ ఆప్టన్‌పై భారత మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి నియామకంతో జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, అద్భుతాలు చేయడం అతడికి చేతకాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిస్తే ఆ ఘనత ఆటగాళ్లు, ద్రవిడ్‌ భాయ్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2011 సమయంలో ప్యాడీ అప్టన్‌ భారత సిబ్బందిలో భాగమైన సంగతి తెలిసిందే. కాగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయగల నిపుణుడిగా పేరొందిన అతడు భారత్‌ టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి.


ప్యాడీ అప్టన్‌(PC: BCCI)

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా అప్టన్‌ను మరోసారి టీమిండియా మెంటల్‌ కండిషనింగ్‌ హెల్త్‌కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియాతో ఇప్పటికే అతడు జట్టుకట్టాడు.

అతడి వల్ల ఏమీకాదు!
ఈ పరిణామాల గురించి మిడ్‌-డేతో శ్రీశాంత్‌ మాట్లాడుతూ.. ‘‘అతడు(అప్టన్‌) అద్భుతాలు చేయలేడు. ఒకవేళ మనం టీ20 వరల్డ్‌కప్‌ గెలిస్తే అది కేవలం మన ఆటగాళ్ల ప్రదర్శన.. రాహుల్‌ భాయ్‌ అనుభవం వల్లే! మనకు పటిష్టమైన జట్టు ఉంది.

అంతేగానీ.. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి జట్టుతో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇక 2011 నాటి ప్రపంచకప్‌ విజయంలో అప్టన్‌ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు.

రాహుల్‌ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే!
‘‘99 శాతం పనిని పూర్తి చేసింది గ్యారీ కిర్‌స్టన్‌.. అప్టన్‌ ఆయనకు కేవలం అసిస్టెంట్‌ మాత్రమే. రాజస్తాన్‌ రాయల్స్‌లో భాగంగా రాహుల్‌ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే మళ్లీ టీమిండియా సిబ్బందిలో భాగం కాగలిగాడు. నిజానికి అతడు మంచి యోగా టీచర్‌. కాబట్టి రాహుల్‌ భాయ్‌ కచ్చితంగా అతడి సేవలు వాడుకుంటాడు’’ అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

కాగా ఈ కేరళ పేసర్‌ గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. క్యాష్‌ రిచ్‌ లీగ్‌-2013 సీజన్‌లో భాగంగా శ్రీశాంత్‌తో పాటు ద్రవిడ్‌, అప్టన్‌ కూడా ఈ ఫ్రాంఛైజీ తరఫున పనిచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌, ద్రవిడ్‌- అప్టన్‌ ద్వయం మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో తన ఆటోబయోగ్రఫీలో అప్టన్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సమయంలో తుది జట్టులో చోటు దక్కని కారణంగా శ్రీశాంత్‌.. తనను, ద్రవిడ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని రాశాడు.

ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో మసకబారిన శ్రీశాంత్‌ కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వరల్డ్‌కప్‌, గెలిచిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడన్న సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top