T20 WC 2022: గెలుస్తే నిలుస్తారు.. న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్‌

T20 WC 2022: England Take On New Zealand In Do Or Die Match - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-1లో ఇవాళ (నవంబర్‌ 1) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 3.850 రన్‌రేట్‌) సెమీస్‌ రేసులో ముందుండగా.. రెండో బెర్త్‌ కోసం ఆస్ట్రేలియా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమితో 5 పాయింట్లు, -0.304 రన్‌రేట్‌), ఇంగ్లండ్‌ (3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు మరో ఓటమితో 3 పాయింట్లు, 0.239 రన్‌రేట్‌) జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:30  గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో ఇంగ్లండ్‌ చావోరేవో తేల్చుకోనుంది.  

ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌ గెలవడంతో పాటు తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇంగ్లండ్‌ 7 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియా గనుక తమ ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ తేడాతో గెలిచి, న్యూజిలాండ్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే.. గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోనుండగా, రెండో బెర్త్‌ కోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ ఉంటుంది.

ఈ సమీకరణల ప్రకారం మూడు జట్లు 7 పాయింట్లతో సమంగా ఉంటే, రన్‌రేట్‌ కీలకం కానుంది. మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు ఈ గ్రూప్‌ నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. న్యూజిలాండ్‌కు ఇ‍ప్పటికే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి.. ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఓ మోస్తరు విజయం సాధిస్తే దర్జాగా సెమీస్‌కు వెళ్తుంది. కాగా, ఈ గ్రూప్‌లో ఉన్న ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక జట్లు దాదాపుగా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్టే.  

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top