పంత్ను కాపాడిన బస్సు డ్రైవర్కు సత్కారం.. ఎప్పుడంటే?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో హమ్మద్పూర్ ఝల్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి.
అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ తన వాహనాన్ని నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్ను కాపాడాడు. దీంతో ఇప్పటికీ సుశీల్ మాన్ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
పంత్ను కాపాడిన సుశీల్ మాన్ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పంత్ ప్రస్తుతం రిషికేష్ లోని ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లతో పాటు ఐపీఎల్కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: IPL 2023: ఐపీఎల్కు పంత్ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అతడే?
మరిన్ని వార్తలు :