రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్

Stuart Binny: Retires From  International cricket - Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్‌ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బిన్నీ సోమవారం ప్రకటించాడు. టీమిండియా తరుపున అతడు 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో  95 మ్యాచ్‌లు ఆడిన  బిన్నీ  4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. కాగా 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన ఘనత సాధించాడు.

ఢాకా వేదికగా  జరిగిన ఈ మ్యాచ్‌లో  భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో అద్భుతం సృష్టించిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. వన్డే క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు బిన్నీ (6/4)వే కావడం విశేషం. ఇక 2014 ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆడిన స్టువర్ట్ బిన్నీ 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2016లో వెస్టిండీస్‌పై  చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. 

కాగా స్టువర్ట్‌ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత మయంతి లాంగర్‌.. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఆండర్సన్‌ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్‌ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్‌ చేసింది. ఆమె ఈ పోస్ట్‌ చేసిన తరువాత రోజే స్టువర్ట్ బిన్నీ రిటైర్మెంట్  ప్రకటించడం  గమనార్హం.


చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top