
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.
అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించగా.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బావుమా తిరిగి మళ్లీ వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు. ఇక చారిత్రత్మక విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు..
👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్లో 282 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్పై 282 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్పై 344 పరుగుల టార్గెట్ను విండీస్ చేధించింది.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా