రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేసిన భారత టీ20 జట్లలో 15 ఏళ్ల వైభవ్కు చోటు దక్కింది.
దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ను సూర్యవంశీ అధిగమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని ఇప్పుడే అంచనాల భారంతో ఒత్తిడికి గురిచేయకూడదని దాదా అభిప్రాయపడ్డాడు.
"వైభవ్ సూర్యవంశీకి ఇంకా కేవలం 15 ఏళ్లే. ఇప్పుడే అతడి నుంచి అద్భుతాలు ఆశించి ఒత్తిడి పెంచకండి. స్వేచ్ఛగా ఆడనివ్వండి. అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలి. అయితే వైభవ్ ఒత్తిడి గురుంచి పెద్దగా పట్టించుకోడని నాకు అనిపిస్తోంది.
అందుకే ఐపీఎల్లో ఒక సంచలనం మారాడు. కానీ భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండడం సహజం. అంతకుతోడు ఐపీఎల్ ఆడే పరిస్థితులకు, యూకే పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అక్కడ బంతి సీమ్ అవుతుంది.
బౌన్స్ , మూవ్మెంట్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త బంతిని ఎదుర్కొవడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. అయినప్పటికి వైభవ్ స్కిల్స్పై నాకు నమ్మకం ఉంది. అక్కడ కూడా అతడు అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని గంగూలీ పేర్కొన్నాడు.
అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. "వైభవ్ చాలా చిన్నవాడని, ఇంకా అనుభవం లేదని మనందరికి తెలుసు. కానీ అతడు తన ఆట తీరుతో సెలక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టి మరీ జట్టులోకి వచ్చాడు" అని డివిలియర్స్ అన్నాడు. కాగా భారత అండర్-19 జట్టు తరపున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా వైభవ్ తనను నిరూపించుకున్నాడు.


