IND vs NZ: ‘అండర్‌డాగ్స్‌ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’ | Should Forget That You Are Underdogs Rohit Sharma will on the attack: Akhtar | Sakshi
Sakshi News home page

IND vs NZ: అండర్‌డాగ్స్‌ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..: అక్తర్‌

Mar 8 2025 9:36 AM | Updated on Mar 8 2025 1:27 PM

Should Forget That You Are Underdogs Rohit Sharma will on the attack: Akhtar

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లను చిత్తు చేసి టాపర్‌గా సెమీస్‌ చేరిన రోహిత్‌ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్‌-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్‌(India vs New Zealand)దే పైచేయి అయినా..  దుబాయ్‌లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్‌ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్‌ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్‌ జట్టు గుర్తించాలని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) అంటున్నాడు.

అండర్‌డాగ్స్‌ అని మర్చిపోండి
భారత్‌- న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్‌కు అక్తర్‌ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్‌డాగ్స్‌గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.

సాంట్నర్‌కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్‌గా అతడు టైటిల్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్‌ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్‌తో మ్యాచ్‌ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్‌ శర్మ.

అతడి దూకుడుకు కళ్లెం వేస్తే
పవర్‌ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్‌ను అటాక్‌ చేస్తాడు. కెప్టెన్‌గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్‌గానూ రాణించాలని అతడికి తెలుసు.

70 శాతం టీమిండియాకే అవకాశం
ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్‌ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. 

స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్‌ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటి​ల్‌ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ గేమ్‌ ఆన్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

 స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోండి
ఇదే షోలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్‌ రొటేట్‌ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.

ఇక సెమీస్‌లో స్మిత్‌ భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడిన విధానం కివీస్‌ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్‌లో షాట్లు బాదుతూ హాఫ్‌ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్‌ మాలిక్‌ సూచనలు చేశాడు. 

కాగా 2000 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలుపొంది టైటిల్‌ గెలిచిన న్యూజిలాండ్‌... వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. 

చదవండి: కెప్టెన్సీకి రోహిత్‌ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement