‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్‌–చిరాగ్‌ | Satwiksairaj and Chirag Shetty awarded Khel Ratna | Sakshi
Sakshi News home page

‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్‌–చిరాగ్‌

May 2 2025 3:41 AM | Updated on May 2 2025 3:41 AM

Satwiksairaj and Chirag Shetty awarded Khel Ratna

భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీకి దక్కిన గౌరవం  

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి ఎట్టకేలకు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ను స్వీకరించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం ఈ అవార్డును వీరిద్దరికి అందజేశారు. 2023 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డును సాత్విక్‌–చిరాగ్‌ తీసుకోవడంలో చాలా ఆలస్యమైంది. రాష్ట్రపతి భవన్‌లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమ సమయంలో మరో చోట టోర్నీలు ఆడుతున్న ఈ డబుల్స్‌ జోడీ గైర్హాజరైంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుకోవడానికి సిద్ధమైన తరుణంలో సాత్విక్‌ తండ్రి కాశీవిశ్వనాథ్‌ అనూహ్య మృతితో అవార్డు కార్యక్రమం వాయిదా పడింది. ‘ఈ ఇద్దరు షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన, అంకితభావానికి దక్కిన గౌరవమిది. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మాండవీయ ట్వీట్‌ చేశారు. ‘ఎట్టకేలకు అవార్డును అందుకున్నాం. మేమిద్దరం జోడీగా మారిన సమయం నుంచి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. 

మా విజయాల్లో వారి సహకారం ఎంతో ఉంది. గత కొద్ది రోజులుగా మేం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చెలరేగి కొత్త విజయాలు సాధించేందుకు ఈ అవార్డు మాకు ప్రేరణనిస్తుంది’ అని సాత్విక్‌–చిరాగ్‌ చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌–చిరాగ్‌ అగ్రశ్రేణి జోడీగా ఎదిగారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో 3 స్వర్ణాలు, 3 రజతాలు గెలుచుకున్న ఈ జంట 2022 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.

 ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ స్థానానికి చేరిన తొలి భారత జోడీగా నిలవడంతో పాటు టీమ్‌ ఈవెంట్‌ థామస్‌ కప్‌ను భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న సుదిర్మన్‌ కప్‌ నుంచి వీరిద్దరు తప్పుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement