విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేరళ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో కేరళ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (137 బంతుల్లో 143 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ శతకం సాధించాడు. అనుకూల్ రాయ్ (72 బంతుల్లో 72; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. నిధీశ్ 4, బాబా అపరాజిత్ 2 వికెట్లు తీశారు.
రోహన్, సంజూ సెంచరీలు
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని కేరళ కేవలం రెండే వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహన్ కున్నుమ్మాళ్ (78 బంతుల్లో 124; 8 ఫోర్లు, 11 సిక్స్లు), సంజూ సామ్సన్ (95 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్లు)ల మెరుపు శతకాలు సాధించారు. సంజూ కాస్త ఆచితూచి ఆడినప్పటికి.. రోహన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అహ్మదాబాద్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరితో పాటు బాబా అపరాజిత్ (41 నాటౌట్; 1 ఫోర్), విష్ణు వినోద్ (40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఇక సంజూ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్కప్ సన్నాహకాలగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకుంటున్నాడు. టీ20 జట్టులో శుభ్మన్ గిల్ లేకపోవడంతో శాంసన్ ఓపెనర్గా మరోసారి బరిలోకి దిగనున్నాడు. శాంసన్కు ఇది నాలుగో లిస్ట్-ఎ సెంచరీ కావడం గమనార్హం.
చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను?


