రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్‌ ఏమిటంటే?! | Rinku Singh To Be Appointed Basic Education Officer By UP Gov: Report | Sakshi
Sakshi News home page

రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్‌ ఏమిటంటే?!

Jun 26 2025 11:13 AM | Updated on Jun 26 2025 12:06 PM

Rinku Singh To Be Appointed Basic Education Officer By UP Gov: Report

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్‌ పేద కుటుంబంలో జన్మించాడు.

పేద కుటుంబం
తన తండ్రి ఇంటింటికి గ్యాస్‌ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్‌గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.

పట్టుదలతో టీమిండియా స్టార్‌గా
దేశవాళీ క్రికెట్‌లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్‌ దశ.. ఐపీఎల్‌తో మారిపోయింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్‌ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.

రూ. 13 కోట్లకు రిటైన్‌
ఇక ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.

స్కూల్‌డ్రాపౌట్‌? 
ఇలా క్రికెట్‌ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్‌ మెడల్‌ విన్నర్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. 

ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్‌ అయినట్లు తెలుస్తోంది.

ఎంపీతో నిశ్చితార్థం
ఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్‌ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్‌ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement