రాణించిన రికీ భుయ్‌ | Ricky Bhui performed well in the Ranji Trophy with Bengal | Sakshi
Sakshi News home page

రాణించిన రికీ భుయ్‌

Feb 7 2026 4:28 AM | Updated on Feb 7 2026 4:28 AM

Ricky Bhui performed well in the Ranji Trophy with Bengal

ఆంధ్ర 264/6

బెంగాల్‌తో రంజీ ట్రోఫీ 

క్వార్టర్‌ ఫైనల్‌  

కళ్యాణి (బెంగాల్‌): బెంగాల్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్ర కెప్టెన్ రికీ భుయ్‌ (83; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం మొదలైన ఈ పోరులో టాస్‌ నెగ్గిన బెంగాల్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట నిలిచే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిõÙక్‌ రెడ్డి (18; 2 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (47; 9 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జతయ్యాక అభిషేక్‌ అవుటయ్యాడు. 

కాసేపటికి అర్ధసెంచరీ దిశగా పరుగులు చక్కబెడుతున్న శ్రీకర్‌ భరత్‌ను ముకేశ్‌ అవుట్‌ చేయడంతో 89 పరుగుల వద్ద ఆంధ్ర రెండో వికెట్‌ను కోల్పోయింది. టాపార్డర్‌ బ్యాటర్‌ షేక్‌ రషీద్‌ (46; 9 ఫోర్లు), కెప్టెన్‌ రికీ భుయ్‌ కుదురుగా ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అయితే ఈ భాగస్వామ్యం బలపడకముందే 129 స్కోరు వద్ద రషీద్‌ నిష్క్రమించాడు. స్వల్పవ్యవధిలో జ్ఞానేశ్వర్‌ (7) కూడా వికెట్‌ పారేసుకోవడంతో 147 వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. 

ఈ దశలో రికీ భుయ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33; 3 ఫోర్లు) వికెట్‌ను కాపాడుకుంటూ జట్టు స్కోరు పెంచారు. దీంతో టీ విరామానికి మరో వికెట్‌ పడకుండా 190/4 స్కోరు చేసింది. ఆఖరి సెషన్‌లో ఆంధ్ర స్కోరు 200 దాటింది. కాసేపటికే 124 బంతుల్లో రికీ భుయ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో పరుగులు సులువుగానే వచ్చాయి. 

ఆట ముగిసే దశలో వరుస ఓవర్లలో వీళ్లిద్దరు అవుటవడం ఆంధ్ర జట్టుకు ఇబ్బందికరంగా మారింది.  255 స్కోరు వద్ద రికీని ఆకాశ్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో నితీశ్‌ను ముకేశ్‌ అవుట్‌ చేశాడు. ఆట నిలిచే సమయానికి త్రిపురాణ విజయ్‌ (1 బ్యాటింగ్‌), శశికాంత్‌ (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

స్కోరు వివరాలు
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) హబిబ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 18; శ్రీకర్‌ (సి) షమీ (బి) ముకేశ్‌ 47; రషీద్‌ (సి) ఛటర్జీ (బి) ముకేశ్‌ 46; రికీ భుయ్‌ (సి) షహబాజ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 83; జ్ఞానేశ్వర్‌ (సి) షహబాజ్‌ (బి) షమీ 7; నితీశ్‌ (సి) ఆకాశ్‌దీప్‌ (బి) ముకేశ్‌ 33; విజయ్‌ (బ్యాటింగ్‌) 1; శశికాంత్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 264. బౌలింగ్‌: మొహమ్మద్‌ షమీ 17–4–38–1, ముకేశ్‌ కుమార్‌ 18–5–50–3, సూరజ్‌ 14–3–53–0, ఆకాశ్‌దీప్‌ 17–3–64–2, షహబాజ్‌  అహ్మద్‌ 14–1–45–0. 

ముంబై 120 ఆలౌట్‌ 
ముంబై: కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబై జట్టు తమ సొంతగడ్డపైనే కుదేలైంది. తొలిరోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 48.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్‌ (5), శార్దుల్‌ ఠాకూర్‌ (16)లాంటి టీమిండియా ప్లేయర్లు అందుబాటులో ఉన్న ముంబై మొదటి రోజే కర్ణాటక బౌలింగ్‌కు బెంబేలెత్తింది. ఓపెనర్‌ అఖిల్‌ హేర్వాడ్కర్‌ (60; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో జట్టు స్కోరు వంద దాటింది. లేదంటే ఇంకా తక్కువ స్కోరుకే ముంబై ఇన్నింగ్స్‌ ముగిసేది. 

ఎందుకంటే అఖిల్‌ మినహా ఇంకెవరూ కూడా 20 పరుగులైనా చేయలేదు. సిద్దేశ్‌ లాడ్‌ (12), సూర్యాన్‌‡్ష (10) రెండంకెల స్కోరు చేశారంతే! విద్వత్‌ కావేరప్ప, ప్రసిధ్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన కర్ణాటక 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (28) విఫలమవగా, మయాంక్‌ అగర్వాల్‌ (54 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో అజేయంగా నిలిచాడు. 

జార్ఖండ్‌ 235 ఆలౌట్‌ 
జంషెడ్‌పూర్‌: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. ఆదిత్య సింగ్‌ (83; 10 ఫోర్లు, 1 సిక్స్‌),  కెప్టెన్ విరాట్‌ సింగ్‌ (47; 5 ఫోర్లు) రాణించారు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో జనమేజయ్‌ 4, ఆదిత్య రావత్, మయాంక్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత తొలి
ఇన్నింగ్‌లో ఉత్తరాఖండ్‌ వికెట్‌ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అవనీశ్‌ (4 బ్యాటింగ్‌), భూపెన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

జమ్మూ కశ్మీర్‌ 194 ఆలౌట్‌ 
ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో తొలిరోజే జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ శుభమ్‌ (60; 6 ఫోర్లు), టెయిలెండర్‌ యు«ద్‌వీర్‌ (41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో పేస్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ 5 వికెట్లు తీయగా, కార్తికేయకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం మధ్యప్రదేశ్‌ 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. హర్‌‡్ష (8 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), యశ్‌ దూబే (14 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement