చెలరేగిన డివిలియర్స్‌

RCB Set Target Of 195 Runs Against KKR - Sakshi

షార్జా:   కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దేవదూత్‌ పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు,  1 సిక్స్‌), అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), ఏబీ  డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి(33 నాటౌట్‌; 28 బంతుల్లో 1 ఫోర్‌)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు.  ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్‌ రొటేట్‌ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్‌లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్‌ ఔటైన తర్వాత గేమ్‌ స్వరూపం మారిపోయింది.

ఏబీడీ విశ్వరూపం
ఫించ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు.  బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్‌ ద వికెట్‌, రౌండ్‌ ద వికెట్‌ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్‌లోకి ఉండటంతో ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కాగా, కోహ్లి ఫోర్‌ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్‌లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్‌లో కోహ్లి సాధించాడు. కేకేఆర్‌ బౌలర్లలో రసెల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు తలో వికెట్‌ లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top