
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా ఐపీఎల్ ఆడిన ఓ పాక్ మాజీ ఆటగాడు ఎంపికయ్యాడు. 50 ఏళ్ల అజహార్ మహమూద్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. ఈ పదవిలో అజహార్ 2026 ఏప్రిల్ వరకు కొనసాగుతాడు. గతేడాది అక్టోబర్లో అజహార్ తొలుత పాక్ ఆల్ ఫార్మాట్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. తాజాగా ప్రమోషన్ పొంది టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు.
ఆకిబ్ జావిద్ నుంచి అజహార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా అజహార్ ప్రయాణం త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్తో మొదలవుతుంది. అజహార్ పాక్ తరఫున 21 టెస్ట్లు, 143 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 2400 పైచిలుకు పరుగులు చేశాడు.
పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఇతను.. టెస్ట్ల్లో 39, వన్డేల్లో 123 వికెట్లు తీశాడు. అజహార్కు కౌంటీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను రెండు సార్లు కౌంటీ ఛాంపియన్షిప్ నెగ్గిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
అజహార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన అతి కొద్ది మంది పాక్ ఆటగాళ్లలో ఒకడు. 2012లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇతను.. నాలుగు సీజన్ల పాటు క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొని 23 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 388 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29 వికెట్లు పడగొట్టాడు.
2015 సీజన్లో అజహార్ న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్కు ప్రత్యామ్నాయంగా కేకేఆర్ జట్టులో చేరాడు. ఐపీఎల్లో ఇదే అతనికి చివరి సీజన్. అప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదు. అయితే అజహార్కు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో ఐపీఎల్లో ఆడగలిగాడు.