ఎంఎస్ ధోని (PC: BCCI/IPL)
మహేంద్ర సింగ్ ధోని... చెన్నై సూపర్ కింగ్స్.. ఈ రెండు పేర్లు పర్యాయపదాల్లాంటివని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి అన్నీ తానై ధోని సీఎస్కేను ముందుకు నడిపిస్తున్నాడు. మధ్యలో జట్టుపై నిషేధం పడినా.. ఆ తర్వాత రీఎంట్రీలోనూ ధోని తనదైన ముద్ర వేశాడు.
ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత
కెప్టెన్ హోదాలో చెన్నైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోనిది. జట్టులో జరిగే ప్రతీ మార్పు, కీలక నిర్ణయాల వెనుక ఈ మిస్టర్ కూల్ ఉంటాడనేది బహిరంగ రహస్యమే. నిజానికి సీఎస్కే ప్రధాన ఆకర్షణ ధోనినే. 45 ఏళ్ల వయసులోనూ ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుతో కొనసాగుతూ బ్రాండ్ వాల్యూ పెరగటంలో దోహదం చేస్తున్నాడు.
హెడ్కోచ్గా?
అయితే, ఈ ఏడాది మాత్రం గాయం వల్ల సీజన్ మొత్తంలో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో తలా ఐపీఎల్ రిటైర్మెంట్ ఖాయమనే వార్తలు వినిపిస్తుండగా.. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఖాళీ చేసిన హెడ్కోచ్ స్థానాన్ని ధోని భర్తీ చేస్తాడనే ఊహాగానాలూ వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఏకంగా 25 శాతం వాటా అడిగిన ధోని?
‘‘ఆర్సీబీ 1.7- 1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 వేల కోట్లకు పైగానే)కు అమ్ముడుపోయిందనే ప్రచారం జరిగింది. సీఎస్కే కూడా ఆర్సీబీ లాంటి అభిమానగణం ఉన్న ఫ్రాంఛైజీ. ఈ జట్టు ఇప్పటికే ఐదు ట్రోఫీలు గెలిచింది.
విదేశాల్లో కూడా పలు లీగ్లలో ఫ్రాంఛైజీలు కలిగి ఉంది. కాబట్టి దీని విలువ ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టమే. మన ఊహకు కూడా అందనంత ఉండొచ్చు. సీఎస్కే ఒక గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తోంది.
సీఎస్కే ఒక గొప్ప బ్రాండ్. దీని విలువ 1.8 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చు. ఇందులో ధోని 25 శాతం వాటా అడిగాడు అనేది నిజంగా సత్యదూరమనే అనిపిస్తోంది. ఇది అసాధ్యం కూడా!.. ఏ ఫ్రాంఛైజీ కూడా ఒకరికి 400 మిలియన్ డాలర్ల మేర వాటా ఇవ్వదు.
ఇదంతా ఓ కట్టకథ
లేదంటే ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఈ మేర పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. ఆ తర్వాత ధోని 20 శాతం అడిగాడని.. అప్పుడు 3.5- 5.5 శాతం వాటా కోసం బేరసారాలు సాగాయని.. ఆఖరికి రెండు లేదా మూడు శాతం కూడా చర్చ జరిగిందట.
నాకైతే ఇదంతా ఓ కట్టకథలా అనిపిస్తోంది. దీనిని ఎవరు సృష్టించారో నాకైతే తెలియదు. నిజంగా ఇది అతిశయోక్తి కంటే ఎక్కువే. ఇది ఎంతమాత్రం నిజం కాదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.


