
ప్రస్తుతం భారత క్రికెట్లో వినిపిస్తున్న పేర్లలో కరుణ్ నాయర్ పేరు ముందువరుసలో ఉంది. దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి, 8 ఏళ్ల తర్వాత టీమిండియా తలుపులు తట్టిన 33 ఏళ్ల ఈ కర్ణాటక మిడిలార్డర్ బ్యాటర్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కరుణ్ ఆడటం దాదాపుగా ఖరారైపోయింది.
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించిన కారణంగా కరుణ్కు భారత జట్టులో చోటు దక్కింది. ఇదే సమయంలో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్ కావడం కూడా కరుణ్కు కలిసొచ్చింది. ఇంగ్లండ్తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్లో కరుణ్ ఆరో స్థానం లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. కరుణ్ ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్పై డబుల్ సెంచరీ బాది మాంచి జోష్లో ఉన్నాడు. భారత క్రికెట్ అభిమానులు సైతం కరుణ్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కరుణ్ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. కరుణ్ తనకు పునర్జన్మనిచ్చిన దేశవాలీ జట్టు విదర్భను వీడాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని విదర్భ క్రికెట్ అసోసియేషన్ కూడా పరోక్షంగా ధృవీకరించింది. అధికారిక లాంఛనాలు పూర్తి కావడమే తరువాయిగా తెలుస్తుంది. కరుణ్ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్తున్నాడని సమాచారం.
కరుణ్ 2023-24 సీజన్కు ముందే కర్ణాటకను వదిలి విదర్భకు వలస వచ్చాడు. విదర్భకు మారడమే కరుణ్ కెరీర్ను మలుపు తప్పింది. ఎనిమిదేళ్లు స్వప్నించిన టీమిండియా రీఎంట్రీ కల సాకారమైంది. విదర్భకు ఆడిన రెండు సీజన్లలో కరుణ్ ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఇంకా చెప్పాలంటే కరుణ్ ప్రదర్శనల కారణంగా విదర్భ తమ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాలను అందుకుంది.
గత దేశవాలీ సీజన్లో (2024-25) కరుణ్ పరుగుల వరద పారించి (863 పరుగులు) విదర్భను రంజీ ఛాంపియన్గా నిలిపాడు. అదే భీకర ఫామ్ను విజయ్ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా కొనసాగించి విదర్భను రన్నరప్గా నిలబెట్టాడు. ఈ టోర్నీలో కరుణ్ విదర్భకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ క్రియాశీలకంగా వ్యవహరించి విదర్భను క్వార్టర్ ఫైనల్స్కు చేర్చాడు.
కరుణ్ రెండు సీజన్లలోనే తన తలరాతను మార్చుకోవడంతో పాటు విదర్భ క్రికెట్ జట్టు స్థాయిని కూడా పెంచాడు. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాల చేత కరుణ్ తనకు పునర్జన్మనిచ్చిన విదర్భను వదిలి సొంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా కరుణ్ను తిరిగి తమ దేశవాలీ జట్టులో చేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంది.
విదర్భకు మరో షాక్
విదర్భకు మరో షాక్ కూడా తగలనున్నట్లు తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జితేశ్ శర్మ (ఆర్సీబీ వికెట్కీపర్ బ్యాటర్) కూడా ఆ జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. 31 ఏళ్ల జితేశ్ బరోడాకు మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా ధృవీకరించినట్లు తెలుస్తుంది.
జితేశ్ మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడని బరోడా క్రికెట్ బోర్డుకు చెందిన కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. జితేశ్ విదర్భకు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కెప్టెన్గా వ్యవహరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ కెప్టెన్సీలో ఆడాడు. అయితే జితేశ్కు రంజీల్లో ఆడే అవకాశం రాలేదు.