జితేష్ శర్మ.. గతేడాది ఆఖరి వరకు భారత టీ20 జట్టులో ఫినిషర్గా, సెకండ్ వికెట్ కీపర్గా రేసులో ఉన్నాడు. కానీ టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఇషాన్ కిషన్ రీఎంట్రీతో పరిస్థితి తారుమారైంది. జితేష్ శర్మను పక్కన పెట్టి సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్టర్లు చోటు ఇచ్చారు.
ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ కాగా, అతడికి బ్యాకప్ కిషన్ ఉన్నాడు. అయితే కిషన్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన పునరాగమనంలో ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ దుమ్ములేపాడు. వరల్డ్కప్తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ ఇషాన్ దుమ్ములేపాడు.
కిషన్ అద్భుతంగా రాణిస్తుండడంతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు జితేష్కు అవకాశం లభించడం లేదు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ప్రకటించిన భారత జట్లలోనూ జితేష్కు చోటు దక్కలేదు. అయితే 32 ఏళ్ల జితేష్ శర్మ ఆ కసి, కోపాన్ని విదర్భ ప్రీమియర్ లీగ్-2026లో తన తొలి మ్యాచ్లో చూపించాడు.
ఐపీఎల్లో నిరాశపరిచిన ఈ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్.. తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. ఈ టోర్నీలో 'నెకో మాస్టర్ బ్లాస్టర్' జట్టుకు సారథ్యం వహిస్తున్న జితేష్ శర్మ... 'ఇండియా వారియర్స్' తో మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ ఆర్సీబీ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 10 బంతుల్లోనే 5 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో నెకో మాస్టర్ బ్లాస్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఇండియా వారియర్స్ జట్టు మ్యాచ్ చివరి బంతికి 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో జితీష్ టీమ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: వైభవ్కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ


