
నేడు ఉప్పల్లో హైదరాబాద్ మ్యాచ్
గుజరాత్ టైటాన్స్తో పోరు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2025లో తమ తొలి మ్యాచ్లో 286 పరుగులు చేసి రాజస్తాన్పై ఘనవిజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ సీజన్ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఒక్కసారిగా పడిపోయింది. సొంత మైదానంలో లక్నో చేతిలో ఓడిన టీమ్...ఆపై వరుసగా ఢిల్లీ, కోల్కతా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మళ్లీ హోం గ్రౌండ్కు చేరిన జట్టు వరుస ఓటముల నుంచి కోలుకోవాలని పట్టుదలగా ఉంది.
నేడు జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్తో హైదరాబాద్ తలపడుతుంది. ఐపీఎల్లో అతి పెద్ద పరాజయాన్ని గత మ్యాచ్లో మూటగట్టుకున్న టీమ్ను మళ్లీ ముందంజలో నిలిపే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగితే భారీ స్కోరు సాధించవచ్చు. క్లాసెన్ మెరుగ్గానే ఆడుతున్నా... నితీశ్ రెడ్డి ఇంకా ఫామ్ను అందుకోలేదు.
కమిందు మెండిస్ ఆల్రౌండ్ ఆట సానుకూలాశం. షమీ, కమిన్స్ బౌలింగ్లో మరింత ప్రభావం చూపించాల్సి ఉంది. బెంగళూరుపై చెలరేగిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు గుజరాత్ తరఫున తన సొంత ఊరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సుదర్శన్, గిల్, బట్లర్ తదితరులతో టైటాన్స్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.