
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ జపమే నడుస్తుంది.
క్రికెట్ దిగ్గజాలు సూర్యవంశీ సృష్టించిన బీభత్సాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మాజీ ఆల్రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్.. ఇలా చాలామంది భారత మాజీలు వైభవ్ను ఆకాశానికెత్తారు. సోషల్మీడియాలో అభిమానులు వైభవ్కు 'బేబీ బాస్'గా బిరుదు ఇచ్చారు.
స్కూల్కు వెళ్లాల్సిన వయసులో (14 ఏళ్ల 32 రోజులు) వైభవ్ సృష్టించిన ఈ విధ్వంసకాండ పొట్టి క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ కుర్రాడిలో ఎదో మ్యాజిక్ ఉందని భావించి ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది.
ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఆ ఇన్నింగ్స్లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
ఈ ఇన్నింగ్స్లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు.

- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా
- ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)
- ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా
- ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (మురళీ విజయ్తో కలిసి)
- టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా
- ఐపీఎల్లో హాఫ్ సెంచరీ (17 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు.
ఈ మ్యాచ్లో ప్రదర్శనకు గానూ వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఇషాంత్ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వైభవ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పిండుకున్నాడు. అనుభవజ్ఞుడు, కోపిష్టి అయిన ఇషాంత్ 14 ఏళ్ల వైభవ్ షాట్లు ఆడుతుంటే నిస్సహాయస్థితిలో చూస్తుండిపోయాడు.
వైభవ్ కరీమ్ జనత్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనూ శివతాండవం చేశాడు. ఆ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఏ బౌలర్నూ వదల్లేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 2 సిక్సలు, 2 ఫోర్లు సహా 21 పరుగులు.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్లో అద్భుతాలు చేస్తున్న ప్రసిద్ద్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ ఇలా ప్రతి ఒక్క బౌలర్ను ఊచకోత కోశాడు. రషీద్ ఖాన్ ఒక్కడే తప్పించుకున్నాడు.
వైభవ్ సృష్టించిన విధ్వంసం ధాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం 15.5 ఓవర్లలోనే ఛేదించబడింది. ఐపీఎల్ చరిత్రలోనే 200 ప్లస్ టార్గెట్ ఇంత తక్కువ బంతుల్లో ఛేదించబడటం ఇదే మొదటిసారి. రాయల్స్ ఇన్నింగ్స్లో జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.
అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84), జోస్ బట్లర్ (26 బంతులోల 50 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.