IPL 2022: దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!

IPL 2022: Deepak Chahar May Lose 14 Crores After Being Ruled Out Injury - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్‌ కిషన్‌ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దీపక్‌ చహర్‌ నిలిచాడు. రూ.14 కోట్లతో సీఎస్‌కే మూడేళ్ల కాలానికి(రూ.42 కోట్లు) చహర్‌ను దక్కించుకుంది. అయితే ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి ముందే గాయంతో దీపక్‌ చహర్‌ దూరమయ్యాడు. తొలుత ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని అంతా భావించారు.

తాజాగా వెన్నుముక గాయంతో సీజన్‌ మొత్తానికే చహర్‌ దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ, సీఎస్‌కే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. రానున్న టి20 ప్రపంచకప్‌ 2022కు కూడా దీపక్‌ చహర్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే కనీసం నాలుగు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే దీపక్‌ చహర్‌ టి20 ప్రపంచకప్‌ ఆడడం కష్టమే.

ఇది సీఎస్‌కేకు బిగ్‌షాక్‌ అనే చెప్పాలి. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో బోణీ చేసింది. అయితే దీపక్‌ చహర్‌ పూర్తిగా దూరమయ్యాడన్న వార్త సీఎస్‌కేకు నష్టం కలిగించే అంశం. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల సామర్థ్యం, నకుల్‌ బంతిని విడవడంలో.. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయడంలో దీపక్‌ చహర్‌ను ప్రత్యేక బౌలర్‌గా నిలిపాయి. అంతేకాదు లోయర్‌ ఆర్టర్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా అతని సొంతం. గతేడాది సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలవడంలో దీపర్‌ చహర్‌ కీలకపాత్ర పోషించాడు.

తాజాగా దీపక్‌ చహర్‌ అంశంలో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చహర్‌కు ఈ ఏడాది సీఎస్‌కే ఒక్క రూపాయి ఇచ్చే అవకాశం లేదు. ఐపీఎల్‌లో తెచ్చిన కొత్త రూల్స్‌ ప్రకారం ఒక ఆటగాడు సీజన్‌ ఆరంభానికి ముందు జట్టుకు దూరమై.. ఆ తర్వాత సీజన్‌ మొత్తానికి అందుబాటులోకి రాకుంటే సదరు ఆటగాడికి ఒక్క రూపాయి చెల్లించే అవకాశం ఉండదు. ఈ లెక్కన చహర్‌ రూ.14 కోట్లు కోల్పోతున్నట్లే. ఇంతకముందు ఒక ఆటగాడు ఒక్క మ్యాచ్‌ ఆడి ఆ తర్వాత సీజన్‌ మొత్తం దూరమైనా అతనికి సదరు ఫ్రాంచైజీ పూర్తి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై అలా కుదరదు. తాజాగా సవరించిన రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..

 సీజన్‌ ఆరంభానికి ముందే ఆటగాడు దూరమైతే సదరు ఫ్రాంచైజీ అతనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
►ఒక ప్లేయర్‌ గాయంతోనో.. లేక వేరే మ్యాచ్‌లు ఆడాలన్న కారణంతో మధ్యలో వైదొలిగితే అతనికి చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 10శాతం మాత్రమే ఇస్తారు. 
►ఇక సీజన్‌ ప్రారంభానికి ముందు ఆటగాడు జట్టు క్యాంప్‌లో రిపోర్టు చేసి.. మ్యాచ్‌ సమయానికి గాయపడి సీజన్‌ మొత్తానికి దూరమైతే 50శాతం డబ్బును చెల్లిస్తారు. అంతేకాదు గాయపడిన ఆటగాడి ట్రీట్‌మెంట్‌ ఖర్చును కూడా భరిస్తుంది.

చదవండి: IPL 2022 GT Vs RR: హార్ధిక్‌ చేసిన ఆ పని వల్ల లక్షల్లో నష్టం.. !

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top