సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భార‌త్‌ ఔట్‌ | Indias Decade Of BGT Dominance Crumbles In Sydney As Australia Win Series 3-1, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భార‌త్‌ ఔట్‌

Jan 5 2025 9:10 AM | Updated on Jan 5 2025 11:50 AM

Indias decade of BGT dominance crumbles in Sydney as Australia win series 3-1

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3-1 తేడాతో భార‌త్ కోల్పోయింది.  పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ ఓట‌మితో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ నుంచి భార‌త్ నిష్క్ర‌మించింది. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.

ఇక మ్యాచ్‌లో భార‌త్ విధించిన 162 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యాన్ని 27 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజ‌యం సాధించింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖావాజా(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్‌ హెడ్‌(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.

నిప్పులు చెరిగిన బోలాండ్‌.. 
అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్‌ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగిం‍చిం భారత్‌ బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌(61) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు.  దీంతో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా బోలాండ్‌ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement