చరిత్ర సృష్టించిన భారత క్రికెట్‌ జట్టు | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత క్రికెట్‌ జట్టు.. విశ్వవేదికపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

Published Sat, Aug 26 2023 8:36 PM

Indian women Blind Cricket Team Won Title In IBSA World Games By Defeating Australia In Finals - Sakshi

విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్‌ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్‌ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ (ఆగస్ట్‌ 26) జరిగిన ఫైనల్లో టీమిండియా..  ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, జగజ్జేతగా అవతరించింది.

వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా.. భారత్‌ 3.3 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేధించి (వర్షం కారణంగా భారత లక్ష్యాన్ని 42 పరుగులకు కుదించారు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

దీం‍తో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌ తొలి ఛాంపియన్‌గా టీమిండియా చరిత్రపుటల్లోకెక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ఫైనల్స్‌తో కలుపుకుని ఆసీస్‌పై 3 సార్లు, ఇంగ్లండ్‌పై 2 సార్లు గెలుపొందింది.  

మరోవైపు ఇదే టోర్నీ పురుషుల విభాగంలో సైతం భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్‌.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. 

Advertisement
Advertisement