భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత | Indian shooter Jaspal Rana passes away at 49 | Sakshi
Sakshi News home page

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

Jun 12 2026 10:11 AM | Updated on Jun 12 2026 10:49 AM

Indian shooter Jaspal Rana passes away at 49

భార‌త క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షూటింగ్ దిగ్గజం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా(49) గుండెపోటుతో   క‌న్నుమూశారు. ఇటీవ‌ల జ‌ర్మ‌నీలో జ‌రిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ముగించుకుని భారత బృందంతో కలిసి తిరిగి వస్తుండగా విమానంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.

దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ(స్టెంట్‌) చేశారు. రాబోయే రోజుల్లో మరో స్టెంట్ వేయాలని వైద్యులు తెలిపారు. జస్పాల్ రాణా పరిస్ధితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధికారికంగా ధ్రువీకరించింది.

తిరుగులేని ఛాంపియన్
జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా,  స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్‌లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. 

దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. 

సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement