కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్ను చిత్తుచేసింది. భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (2వ, 28వ, 34వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించగా... కేతన్ ఖుషా్వహా (30వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. జపాన్ తరఫున నుమాడా గాకు (52వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు.
సెమీఫైనల్లో పాకిస్తాన్పై నాలుగు గోల్స్తో సత్తాచాటిన ఆశిశ్... తుది పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తూ మూడు గోల్స్ కొట్టడంతో ప్రత్యర్థి పై ఒత్తిడి పెరిగింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికే భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా... చివర్లో జపాన్ ఒక గోల్ నమోదు చేసింది. ఇదే వేదికపై జరిగిన మహిళల టోర్నీలో భారత్కు కాంస్యం దక్కింది. కాంస్య పతక పోరులో భారత్ 3–0తో కొరియాపై విజయం సాధించింది. మన జట్టు తరఫున సందీప కుమారి (2వ నిమిషంలో), స్వీటీ కుజుర్ (16వ నిమిషంలో), నౌషీన్ నాజ్ (33వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు.


