IND Vs AUS T20 Series: షమీ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌.. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ?

India vs Australia T20 Series: Umesh Yadav Likely Replace Mohammed Shami - Sakshi

ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాక్‌ తగిలింది. జట్టు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసీస్‌తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. షమీ స్థానంలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఇది నిజమైతే మాత్రం ఉమేశ్‌ యాదవ్‌ మళ్లీ మూడేళ్ల తర్వాత టి20ల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్‌తో టి20 సిరీస్‌కు షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతన్ని తప్పించిన మేనేజ్‌మెంట్‌ ఉమేశ్ యాదవ్‌కి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. 

ఇక ఐపీఎల్‌ 2022లో కేకేఆర్ తరుపున మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఉమేశ్ యాదవ్, 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఎక్కువగా మొదటి ఓవర్‌లో వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, బ్యాటుతోనూ రాణించాడు. ఐపీఎల్ 2022 తర్వాత  రాయల్ లండన్ వన్డే క్రికెట్ టోర్నీలో  7 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్ 16 వికెట్లు పడగొట్టి, మిడిల్‌సెక్స్ క్లబ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొనే ఉమేశ్‌ యాదవ్‌ను ఆఖరి నిమిషంలో షమీ స్థానంలో ఆసీస్‌తో టి20 సిరీస్‌కు ఎంపిక చేసినట్లు సమాచారం.

నిజానికి గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్,  సెప్టెంబర్ 17న తిరిగి జట్టుతో మిడిల్‌సెక్స్ టీమ్‌తో కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి రెండు మ్యాచుల్లో ఆడాల్సింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఉమేశ్ యాదవ్, చివరి రెండు మ్యాచుల్లో ఆడడం లేదని మిడిల్‌సెక్స్ ప్రకటించింది .ఇది జరిగిన 24 గంటలకే ఉమేశ్ యాదవ్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు వార్తలు రావడం విశేషం.

ఉమేశ్ యాదవ్‌ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడని, అందుకే అతన్ని మహ్మద్ షమీకి రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారని సమాచారం. కొన్నాళ్లుగా టెస్టుల్లో కొనసాగుతూ వస్తున్న ఉమేశ్ యాదవ్, చివరిగా 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. దీంతో ఉమేశ్ యాదవ్‌ మళ్లీ మూడేళ్ల తర్వాత టీమిండియా తరుపున టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top