వామ్మో మాంచెస్టర్‌.. భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు | India Cricket Teams records at Old Trafford, Manchester | Sakshi
Sakshi News home page

IND vs ENG: వామ్మో మాంచెస్టర్‌.. భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు

Jul 18 2025 5:02 PM | Updated on Jul 18 2025 5:29 PM

India Cricket Teams records at Old Trafford, Manchester

లార్డ్స్ టెస్టులో అనుహ్య ఓట‌మి త‌ర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో మ‌రో కీల‌క పోరుకు టీమిండియా సిద్ద‌మైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం వేదిక‌గా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భార‌త్ మాత్రం ప్ర‌త్య‌ర్ధిని ఎలాగైనా ఓడించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్ కోసం శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అయితే ఈ కీలక‌పోరుకు ముందు మాంచెస్ట‌ర్‌లో గ‌త రికార్డులు టీమిండియాను భయ‌పెడుతున్నాయి.

ఇంగ్లండ్‌దే పైచేయి..
ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో విజ‌యం సాధించి ఇంగ్లండ్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు మాంచెస్ట‌ర్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టివ‌ర‌కు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెల‌వలేదు. ఈ మైదానం వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మొత్తం తొమ్మిది టెస్టులు జ‌రిగాయి.

అందులో ఇంగ్లండ్ నాలుగింట విజ‌యం సాధించ‌గా.. మ‌రో ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భార‌త జ‌ట్టు చివ‌ర‌సారిగా ఈ వేదిక‌లో 2014లో టెస్టు మ్యాచ్ ఆడింది. మ‌ళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల త‌ర్వాత ఈ ప్ర‌తిష్టాత్మక మైదానంలో భార‌త్ ఆడ‌నుంది.

భారత ఓటమికి కారణమిదే..?
ఇప్ప‌టివ‌ర‌కు ఈ మైదానంలో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించిక‌పోవ‌డం వెన‌క చాలా కార‌ణాలు ఉన్నాయి. ఈ మైదానంలో పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తోంది. ఈ గ్రీన్ టాప్ వికెట్‌పై పేసర్లు పండగ చేసుకుంటారు. ఇటువంటి పిచ్‌పై ఆసియా జట్లకు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది.

బ్యాటర్లు స్వింగింగ్ కండీషన్స్‌కు అలవాటు పడకపోవడంతో ఈ మైదానంలో ఏషియన్ జట్లు ఎక్కువగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్‌ల్లో, 15 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.

మిగిలిన 36 మ్యాచ్‌లను డ్రాగా ముగిసింది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోర్ 390 పరుగులగా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్ మిన‌హా మిగితా ఎవ‌రూ కూడా మైదానంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరపున‌ ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయ‌న ఈ మైదానంలో మూడు టెస్టులు ఆడి 242 పరుగులు చేశాడు.

మాంచెస్టర్‌లో భారత రికార్డులు
అత్యధిక స్కోరు: 119.2 ఓవర్లలో 432/10 (ఆగస్టు 1990).

అత్యల్ప స్కోరు: 21.4 ఓవర్లలో 58/10 (జూలై 1952).

అతిపెద్ద ఓటమి (ఇన్నింగ్స్ వారీగా): 1952లో భారత్‌ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అండ్ 207 పరుగుల తేడాతో ఓడించింది.

అతిపెద్ద ఓటమి (పరుగులు వారీగా): జూలై 1959లో భారత్‌ను 171 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓడించింది.

అత్యధిక పరుగులు: సునీల్ గవాస్కర్ మూడు టెస్టుల్లో 242 పరుగులు.

అత్యధిక స్కోరు: ఆగస్టు 1990లో మహ్మద్ అజారుద్దీన్ 243 బంతుల్లో 179 పరుగులు.

అత్యధిక సగటు: సచిన్ టెండూల్కర్ 187.00 (ఒక టెస్ట్‌లో 187 పరుగులు).

సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే: సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్, అబ్బాస్ అలీ బేగ్, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మహ్మద్ అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement