సెమీస్‌కు భారత్‌.. ప్రగల్బాలు పలికిన పాక్‌ లీగ్‌ దశలోనే ఇంటికి | India Beat Nepal 2-0-Enters-Semi-Final SAFF Championship 2023 | Sakshi
Sakshi News home page

#SAFF2023: సెమీస్‌కు భారత్‌.. ప్రగల్బాలు పలికిన పాక్‌ లీగ్‌ దశలోనే ఇంటికి

Jun 25 2023 7:45 AM | Updated on Jun 25 2023 7:50 AM

India Beat Nepal 2-0-Enters-Semi-Final SAFF Championship 2023  - Sakshi

బెంగళూరు: ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్‌ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సునీల్‌ ఛెత్రి సేన 2–0 గోల్స్‌తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్‌ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్‌ చేయలేకపోయిన భారత్‌ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్‌ చేసింది.

కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్‌ సాధించగా, నోరెమ్‌ మహేశ్‌ సింగ్‌ 70వ నిమిషంలో గోల్‌ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్‌ ఫార్వర్డ్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్‌ ఒక షాట్‌కే పరిమితమైంది.

మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్‌ అజేయమైన రికార్డు 12 మ్యాచ్‌లకు చేరింది. 2019లో సెప్టెంబర్‌ 5న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్‌ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్‌ 2–0తో పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో కువైట్‌ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌తో గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్‌లు లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టాయి.

చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement