శ్రీలంకతో రెండో టెస్టు: భారత క్రికెట్‌ రికార్డు వీరుడి ‘అరంగేట్రం’! | IND A vs SL A: Who Is Aman Mokhade The Fastest Indian To 1000 List A Runs | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో రెండో టెస్టు: భారత క్రికెట్‌ రికార్డు వీరుడి ‘అరంగేట్రం’!

Jul 2 2026 12:52 PM | Updated on Jul 2 2026 1:17 PM

IND A vs SL A: Who Is Aman Mokhade The Fastest Indian To 1000 List A Runs

అమన్‌ మోఖడే (PC: BCCI X)

భారత్‌- శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌ గురువారం మొదలైంది. గాలే వేదికగా టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య శ్రీలంక భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.

ఓపెనర్లలో సోహాన్‌ డి లివెరా (28)ను యశ్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపగా.. పవంత వీరసింగే (39) వికెట్‌ను గుర్నూర్‌ బ్రార్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక- ‘ఎ’తో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా భారత్‌- ‘ఎ’ తరఫున విదర్భ స్టార్‌ అమన్‌ మోఖడే ‘అరంగేట్రం’ చేశాడు.

ఎవరీ అమన్‌ మోఖడే?
విదర్భ తరఫున 2022లో అమన్‌ మోఖడే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు.

ఆ మరుసటి ఏడాది లిస్ట్‌-‘ఎ’ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన అమన్‌ మోఖడే.. రంజీ తాజా ఎడిషన్‌, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో కేవలం పది ఇన్నింగ్స్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఏకంగా 814 పరుగులు సాధించాడు.

ప్రపంచ రికార్డు సమం చేసిన వీరుడు
తద్వారా సీజన్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవడంతో పాటు విదర్భ ట్రోఫీ గెలవడంలోనూ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అమన్‌ మోఖడే కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. భారత లిస్ట్‌- ‘ఎ’ క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే అమన్‌ మోఖడే ఈ మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్‌ పొలాక్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. కాగా దేవ్‌దత్‌ పడిక్కల్‌, అభినవ్‌ ముకుంద్‌ పదిహేడు ఇన్నింగ్స్‌లో లిస్ట్‌-ఎ క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా.. అమన్‌ వారిద్దరిని అధిగమించడమే కాకుండా.. పొలాక్‌ రికార్డును సమం చేయడం విశేషం.

రంజీలోనూ రాణించి..
సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటకపై శతక్కొట్టి.. అమన్‌ మోఖడే ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో పదకొండు ఇన్నింగ్స్‌ ఆడిన 25 ఏళ్ల అమన్‌ మోఖడే.. 760 పరుగులు సాధించాడు. 

ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్‌- ‘ఎ’ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన అమన్‌.. భారత్‌- ‘ఎ’ జట్టు తరఫున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని.. త్వరలోనే టీమిండియాకూ ఆడే స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం!!

చదవండి: ‘వైభవ్‌ను ఇపుడే ఆడించొద్దు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement