రోహిత్‌- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్‌ | IND vs AFG: Team India coach breaks silence on Kohli Rohit Fitness | Sakshi
Sakshi News home page

రోహిత్‌- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్‌

Jun 4 2026 7:20 PM | Updated on Jun 4 2026 7:44 PM

IND vs AFG: Team India coach breaks silence on Kohli Rohit Fitness

అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్‌-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.

అంతలోనే గాయమా?
ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్‌ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్‌ చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.

ఫలితంగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.

రోహిత్‌ కూడా డౌటే
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సైతం సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..

కోచ్‌ ఏమన్నాడంటే..
‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్‌, రోహిత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్‌ ఒకేలా ఉంటుంది.

వాళ్లు ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.

ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్‌ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

ఏం జరుగుతోంది?
ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. 

చదవండి: ‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

Advertisement
 
Advertisement
Advertisement