
మహిళల గ్రాండ్ప్రి సిరీస్ చెస్ టోర్నీ
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అజేయపరంపర కొనసాగుతోంది. భారత్కే చెందిన మరో స్టార్ గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారికతో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను హంపి ‘డ్రా’గా ముగించింది. తెల్ల పావులతో ఆడిన హంపి గేమ్ను 19 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3.5 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.
ఈ టోర్నీలో హంపి రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్ను దివ్య దేశ్ముఖ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్, తమిళనాడు అమ్మాయి వైశాలి రమేశ్బాబు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో వైశాలి తెల్లపావులతో ఆడుతూ 52 ఎత్తుల్లో గెలుపొందింది.
జు జినెర్ (చైనా)–నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) మధ్య జరిగిన గేమ్ 71 ఎత్తుల్లో... మెలియా సలోమి (జార్జియా)–అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత జు జినెర్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే ఆరో రౌండ్ గేముల్లో దివ్య దేశ్ముఖ్తో ద్రోణవల్లి హారిక; బత్కుయాగ్ మున్గున్తుల్తో కోనేరు హంపి; జు జినెర్తో వైశాలి; పొలీనా షువలోవాతో మెలియా సలోమి; నుర్గుల్ సలీమోవాతో అలీనా కష్లిన్స్కాయా తలపడతారు.