21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు

Hardik Pandya And Ravindra Jadeja Set New Record 150 Runs Partnership - Sakshi

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా అని చెప్పొచ్చు. 152 పరుగుల వద్ద 5 వికెట్‌ కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ టీమిండియా ఒక దశలో 250 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆరవ వికెట్‌కు పాండ్యా, జడేజాలు కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా జట్టుపై 6వ వికెట్‌కు 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించారు. (చదవండి : ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’)

1999లో ఇదే ఆసీస్‌పై రాబిన్‌ సింగ్‌, శఠగోపన్‌ రమేశ్‌లు 6వ వికెట్‌కు 123 పరుగుల జోడించడం ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. తాజాగా ఆ రికార్డును 21 ఏళ్ల తర్వాత పాండ్యా, జడేజాలు కలిసి సవరించారు. ఓవరాల్‌గా చూసుకుంటే పాండ్యా, జడేజా జోడి ఆసీస్‌పై చేసిన 150 పరుగుల భాగస్వామ్యంతో మూడవ స్థానంలో ఉండగా... అంబటి రాయుడు, స్టువర్ట్‌ బిన్నీ కలిసి 2015లో జింబ్వాబేతో జరిగిన వన్డేలో 6 వికెట్‌కు 160 పరుగులు జోడించి మొదటి స్థానంలో ఉన్నారు. కాగా రెండో స్థానంలో ధోని, యువరాజ్‌ జోడి నిలిచింది. వీరిద్దరు కలిసి 2005లో జింబ్వాబేపై 6వ వికెట్‌కు 158 పరుగుల జోడించారు.

కాగా ఆసీస్‌తో నేడు జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా మరో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 76 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 92 పరుగులు చేశాడు. పాండ్యాకు వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఆఖర్లో జడేజాకు ఎక్కువగా స్ట్రైక్‌ ఇచ్చాడు. మరోవైపు  32 ఓవర్‌లో ప్యాండ్యాకు జత కలిసిన జడేజా కూడా యదేచ్చగా బ్యాట్‌ ఝులింపించాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు పిండుకున్నాడు. (చదవండి : సచిన్‌ రికార్డును అధిగమించిన కోహ్లి)

టీమిండియా విధించిన 303 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ నిలకడగా చేధిస్తోంది. ఇప్పటివరకు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ 59 పరుగులతో, హెన్రిక్స్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన స్టీవ్‌ స్మిత్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో 7 పరుగులకే అవుట్‌ కావడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న టి. నటరాజన్‌  ఓపెనర్‌ మార్నస్‌ లబుషేన్ను 7 పరగుల వద్ద ఔట్‌ చేసి టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top