Blitz Chess Championship: ‘బ్లిట్జ్‌’ చాంపియన్‌ అర్జున్‌ 

Grand Master Arjun Erigaisi Won 2022 Tata Steel Chess India Open Blitz - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ఓపెన్‌ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్‌ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్‌ (అజర్‌బైజాన్‌) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్‌ ఈవెం ట్‌లో అర్జున్‌ రన్నరప్‌గా నిలిచాడు.

బ్లిట్జ్‌ ఈవెంట్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్‌ ఈవెంట్‌లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్‌ ఈవెంట్‌లో టైటిల్‌ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్‌) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. 

ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top