వైభవ్ సూర్యవంశీ (PC: BCCI)
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియా లెజెండ్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలను మించిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆకాశానికెత్తాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధిగా వైభవ్ను అభివర్ణించాడు.
ఫార్మాట్లకు అతీతంగా
గతేడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో అలరించాడు.
ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డలపై యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఇక అండర్-19 వరల్డ్కప్ ఆద్యంతం అలరించిన వైభవ్.. ఫైనల్లో ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఆరెంజ్ క్యాప్ విజేత
వరల్డ్కప్లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా వైభవ్ గెలుచుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల నుంచి వైభవ్ సూర్యవంశీ పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించడంతో పాటు ఆసియా క్రీడలు- 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్ వైభవ్పై ప్రశంసలు కురిపించాడు.
సచిన్, కోహ్లిలను మించిపోతాడు
‘‘సచిన్, విరాట్లను ఈ పిల్లాడు మించిపోగలడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ ఉంటే.. తన కెరీర్ ముగిసేనాటికి వీరిద్దరి కంటే పెద్ద స్టార్గా ఎదుగుతాడు. వైభవ్ సూర్యవంశీ విభిన్న ఆటగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్ల కంటే వైభవ్ ఎంతో బెటర్.
అతడొక అద్భుతమైన పిల్లాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధి. అతడు ఇండియాలో ఆడినపుడు నేను దగ్గరగా చూశాను. అక్కడి బౌండరీలు చిన్నగానే ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు పవర్హిట్టింగ్ ఆడాడు’’ అని డేల్ స్టెయిన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.
అయితే, వైభవ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీసీసీఐకి ఈ సందర్భంగా స్టెయిన్ సూచించాడు. పదిహేనేళ్ల పిల్లాడు ఒత్తిడికి లోనుకాకుండా.. అతడిపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నాడు.


