న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ గంభీర్కు అండగా నిలిచాడు. కోచ్ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది.
ఈ నేపథ్యంలో గావస్కర్ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్ పరాజయానికి గంభీర్ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్గా ఉంచాలని మీరు చెప్పారా.
మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్ వైపు చూస్తారు’ అని గావస్కర్ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్ను కోచ్గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్రెండన్ మెక్ల్లమ్ అన్ని ఫార్మాట్లలో కోచింగ్ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు.


