ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ రిషబ్ పంత్ అనే చెప్పాలి. కెప్టెన్గా అతడు తీసుకున్న తలతిక్క నిర్ణయాలే లక్నో కొంపముంచాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ తొలుత కేకేఆర్ను బ్యాటింగ్కు అహ్హనించాడు.
పంత్ తీసుకున్న నిర్ణయం సరైందే అని రెండో ఓవర్లోనే నిరూపించాడు పేసర్ మోహ్సిన్ ఖాన్. మోహ్సిన్ డేంజరస్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ను డకౌట్గా పెవలియన్కు పంపాడు. మోహ్సిన్ అక్కడితో అక్కడతో అగలేదు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ టాపార్డర్, మిడిలార్డర్ను దెబ్బతీశాడు.
అతడి బౌలింగ్ ధాటికి కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్దీప్ సింగ్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ఇక క్రీజులో రెగ్యులర్ బ్యాటర్ రింకూ సింగ్ ఒక్కడే మిగిలాడు. దీంతో కేకేఆర్ కనీసం వంద పరుగులు మార్క్ అయినా దాటుతుందా అని అంతా భావించారు. రింకూ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 112 పరుగులుగా ఉండేది. 19 ఓవర్ వేసిన షమీ బౌలింగ్లో రింకూ 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేకేఆర్ స్కోర్ 129 పరుగులకు చేరింది. అయితే ఈ సమయంలో పంత్ తీసుకున్న ఓ నిర్ణయం లక్నోను దెబ్బతీసింది. పేస్ బౌలర్ల ఓవర్ల కోటా పూర్తి కావడంతో ఆఖరి ఓవర్ స్పిన్నర్తో వేయించాల్సి వచ్చింది.
సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ జార్జ్ లిండేతో పంత్ చివరి ఓవర్ వేయిస్తాడని అంతా భావించారు. కానీ పంత్ మాత్రం రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అయిన దిగ్వేష్కు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంకేముంది రింకూలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. వరుసగా నాలుగు సిక్స్లు బాది చివరి ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్ల రూపంలో వచ్చాయి. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది.
జిడ్డు బ్యాటింగ్
అనంతరం లక్ష్య చేధనలో రెండో ఓవర్లోనే లక్నోకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ను వైభవ్ ఆరోరా పెవిలియన్కు పంపాడు. అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఐడైన్ మార్క్రమ్(27 బంతుల్లో 31) కలిసి టెస్టు క్రికెట్ ఆడాడు.
36 బంతుల్లో కేవలం 38 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. తొలుత పంత్, మార్క్రమ్ నెమ్మదిగా ఆడడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. యాధావిథిగా నికోలస్ పూరన్ సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటయ్యాడు. అయితే ఆఖరిలో ఆయూశ్ బదోని, హిమత్ సింగ్, షమీ బ్యాట్ ఝూళిపించడంతో స్కోర్లు సమమయ్యాయి.
సూపర్ ఓవర్లోనూ..
దీంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని తేల్చాల్చి వచ్చింది. సూపర్ ఓవర్లో కూడా పంత్ పేలవ కెప్టెన్సీ కన్పించింది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న నికోలస్ పూరన్తో పాటు మార్క్రమ్లను ఓపెనర్లుగా లక్నో పంపింది. సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. మూడో బంతికి మార్క్రమ్ ఔటయ్యాడు.
దీంతో లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. అనంతరం రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ బాది కేకేఆర్ను గెలిపించాడు. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో పంత్పై నెటిజన్లు ఫైరవతున్నారు.
ఏ మాత్రం ఆటకేనా రూ.27 కోట్లు తీసుకుంటున్నావు అని పోస్ట్లు పెడుతున్నారు. ఐపీఎల్కే దిక్కులేదు.. నీకు ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా అంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. కాగా రిషబ్ పంత్ ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఒకనొక దశలో టీమిండియా టెస్టు కెప్టెన్ పంత్ అవుతాడని ప్రచారం జరిగింది.
చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టా


