Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్‌తో అదరగొట్టారు | England vs India: Shubman Gill and Yashasvi Jaiswal struck centuries | Sakshi
Sakshi News home page

Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్‌తో అదరగొట్టారు

Jun 21 2025 6:21 AM | Updated on Jun 21 2025 10:42 AM

England vs India: Shubman Gill and Yashasvi Jaiswal struck centuries

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 359/3

గిల్, జైస్వాల్‌ శతకాలు 

పంత్‌ అర్ధసెంచరీ

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు 

భారత టెస్టు క్రికెట్‌లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్‌గా తొలి పరీక్షలో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్‌ పంత్‌ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్‌పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్‌ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు.  

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్‌ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (175 బంతుల్లో 127 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో చెలరేగగా, వైస్‌ కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (102 బంతుల్లో 65 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్‌కు ఆరో శతకం. జైస్వాల్, గిల్‌ మూడో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్‌ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు.  

సిరీస్‌లో శుభారంభం... 
ఓపెనర్లు జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్‌ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్‌ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్‌ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్‌ (0) అవుట్‌ కాగా...లంచ్‌ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది.  

భారీ భాగస్వామ్యం... 
విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్‌లో జైస్వాల్, గిల్‌ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్‌కు దాదాపు ఐదు పరుగుల రన్‌రేట్‌తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్‌ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్‌ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్‌ కార్స్‌ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్‌ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్‌ 48 బంతులే (8 ఫోర్లు, 
1 సిక్స్‌తో) తీసుకోవడం విశేషం.  

పంత్‌ జోరు... 
టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్‌ వికెట్‌ కోల్పోయింది. జైస్వాల్‌ను స్టోక్స్‌ బౌల్డ్‌ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పంత్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్‌ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్‌ ఓవర్లో పంత్‌ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్‌ ఓవర్లో కవర్స్‌ దిశగా ఆడి గిల్‌ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్‌ కొత్త బంతిని  తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్‌ హాఫ్‌ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ ఈ జోడీని విడదీయలేకపోయింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) స్టోక్స్‌ 101; రాహుల్‌ (సి) రూట్‌ (బి) కార్స్‌ 42; సాయి సుదర్శన్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; గిల్‌ (బ్యాటింగ్‌) 127; పంత్‌ (బ్యాటింగ్‌) 65; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. 
వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. 
బౌలింగ్‌: వోక్స్‌ 19–2–89–0, కార్స్‌ 16–5–70–1, టంగ్‌ 16–0–75–0, స్టోక్స్‌ 13–1–43–2, బషీర్‌ 21–4–66–0.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement