చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జోరందుకున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.
ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది.
The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.
Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR— BCCI (@BCCI) July 1, 2026


