ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌.. డీజీపీ సీవీ ఆనంద్ స్పంద‌న ఇదే! | DGP CV Anand Praise-Mickil-Jaiswal-Better Catch Ever-In-TG20 League | Sakshi
Sakshi News home page

ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌.. డీజీపీ సీవీ ఆనంద్ స్పంద‌న ఇదే!

Jul 6 2026 5:55 PM | Updated on Jul 6 2026 7:28 PM

DGP CV Anand Praise-Mickil-Jaiswal-Better Catch Ever-In-TG20 League

టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ ఆట‌గాడు మికిల్ జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రంగారెడ్డి రైజ‌ర్స్ 139 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు హ‌ర్షిత్ సాయి బౌలింగ్‌లో నితిన్ సాయి యాద‌వ్ భారీ షాట్‌కు య‌త్నించాడు. అయితే బౌండ‌రీ లైన్ వ‌ద్ద కాచుకు కూర్చున్న మికిల్ జైస్వాల్ త‌న‌ను తాను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ అందుకున్నాడు. 

ఈ క్ర‌మంలో బౌండ‌రీ లైన్‌కు త‌గ‌ల‌కుండా అలాగే నిల‌బ‌డ్డాడు. మికిల్ జైస్వాల్ క్యాచ్ విన్యాసం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. 

'1982లో లీగ్ క్రికెట్ ఆడ‌డం ప్రారంభించాను. అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా నా జీవితంలో ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ చూడ‌లేదు. ఇక్క‌డ అద్భుత‌మైన విష‌య‌మేంటంటే.. మికిల్ జైస్వాల్ బౌండ‌రీ దాట‌కుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా క్యాచ్ ప‌ట్టిన విధానం హైలైట్‌గా మారింది. మ‌రి దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారో చెప్పండి' అని పేర్కొన్నారు. 

మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. ఆదిత్య జ‌వ్వాజి (43), గ్నానా రెడ్డి (36) రాణించారు. ఖ‌మ్మం బౌల‌ర్ల‌లో సీవీ మిలింద్ మూడు వికెట్లు తీయ‌గా, హ‌ర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఖ‌మ్మం ఏసెస్ 17.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 150 ప‌రుగులు చేసి గెలుపొందింది. కొనిదెల హిమ‌తేజ (45), మికిల్ జైస్వాల్ (30), ఆఖ‌ర్లో కెప్టెన్ సీవీ మిలింద్ (29 నాటౌట్‌) రాణించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement