ఐపీఎల్‌ 2020: నిలవాలంటే గెలవాల్సిందే..! | CSK Won The Toss And Elected To Bat First Against Rajasthan | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2020: నిలవాలంటే గెలవాల్సిందే..!

Oct 19 2020 7:07 PM | Updated on Oct 19 2020 7:27 PM

CSK Won The Toss And Elected To Bat First Against Rajasthan - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఇరుజట్లు తలో తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడి మూడేసి మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. పాయింట్ల పట్టికలో సీఎస్‌కే ఏడో స్థానంలో ఉండగా, రాజస్తాన్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. దాంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో విజయం కీలకం. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు ప్రతీ మ్యాచ్‌ కీలకం. ఇంకా ఇరు జట్లకు ఐదేసి మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను తీసేస్తే నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయి. దాంతో తాజా మ్యాచ్‌ సీఎస్‌కే-రాజస్తాన్‌లకు అత్యంత  కీలకం. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. హజిల్‌వుడ్‌, చావ్లాలు తుది జట్టులోకి వచ్చారు. బ్రేవో గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కరణ్‌ శర్మ స్థానంలో పీయూష్‌ చావ్లాను జట్టులోకి తీసుకున్నారు. రాజస్తాన్‌ ఒక మార్పు చేసింది. పేసర్‌ ఉనాద్కత్‌ను తప్పించారు.  అతని స్థానంలో రాజ్‌పుత్‌ను తీసుకున్నారు. 

అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంకం మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు ఇప్పటివరకూ 22 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్తాన్‌ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సీఎస్‌కే జట్టు ఎక్కువగా డుప్లెసిస్‌, అంబటి రాయుడు, వాట్సన్‌లపైనే బ్యాటింగ్‌లో ఆధారపడుతోంది. ఎంఎస్‌ ధోని ఇంకా టచ్‌లోకి రాలేదు. రవీంద్ర జడేజా అప్పడప్పుడు మెరుపులు మెరిపిస్తుండటంతో బ్యాటింగ్‌ విభాగం బాగానే కనిపిస్తోంది. కానీ ఆరంభం బాగుంటేనే చివర్లో పరుగులు సాధించే వీలుంటుంది. 

సీఎస్‌కే బ్యాటింగ్‌ విభాగంలో అత్యధిక పరుగులు చేసిన వారిలో డుప్లెసిస్‌(365), వాట్సన్‌(277), అంబటి రాయుడు(237)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక రాజస్తాన్‌ జట్టులో సంజూ శాంసన్‌(236), రాహుల్‌ తెవాటియా(222)లు రెండొందల పరుగులకు పైగా సాధించారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. స్మిత్‌ మరొకసారి బ్యాట్‌ ఝుళిపించడంతో పాటు శాంసన్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఇరు జట్ల బౌలింగ్‌  విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో జోఫ్రా ఆర్చర్‌(12-రాజస్తాన్‌) తొలిస్థానంలో ఉన్నాడు. సామ్‌  కరాన్‌(10-సీఎస్‌కే), శార్దూల్‌ ఠాకూర్‌(9-సీఎస్‌కే)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

రాజస్తాన్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), రాబిన్‌ ఊతప్ప, బెన్‌ స్టోక్స్‌, సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగా్‌, రాహుల్‌ తెవాటియా, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌‌, అన్‌కిత్‌ రాజ్‌పుత్‌, కార్తీక్‌ త్యాగి

సీఎస్‌కే
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, సామ్‌ కరాన్‌, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌, దీపక్‌ చాహర్‌, పీయూష్‌ చావ్లా, శార్దూల్‌ ఠాకూర్‌, జోష్‌ హజిల్‌వుడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement