ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు.
తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.
రుమేష్ ప్రయాణం ఆసక్తికరం..
పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది.

అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.
2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.
తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.

క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


