ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా భువీ..

Bhuvneshwar Kumar And Lizelle Lee Voted ICC Players For The Month Of March 2021 - Sakshi

దుబాయ్‌: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్‌ సీన్‌ విలియమ్స్‌, అఫ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్‌ వేయడం విశేషం. 

ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే  ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఫిబ్రవరి నెలకు ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ​లిజెల్‌ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్‌ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ రౌత్‌) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్‌ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top