మార్చిలో 9 శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 9% పెరిగి రూ.2,00,064 కోట్లకు చేరింది. ఇందులో దిగుమతులపై జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 17.8% పెరిగి రూ.53,861 కోట్లుగా ఉంది. 2025–26లో నెలవారీ మూడో అత్యధిక వసూళ్లు ఇవి. 2025 ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్లు వసూలు కాగా, మేలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2025 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది.
మార్చి నెలలో రిఫండ్లు 13.8% పెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం 8% వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాదితో పోల్చి చూస్తే 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తులపై పన్ను రేటు దిగిరావడం తెలిసిందే. అయినప్పటికీ జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది.


