అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్ సిమ్యులేషన్స్’లో సాధన చేస్తాడు. ఐపీఎల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.
అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్గా ఉంటేనే టీమ్లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.
ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.
అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదే:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్?


