IND Vs BAN: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా

Bangladesh Move India ODI Match From Dhaka After Protest Threat - Sakshi

డిసెంబర్‌లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. డిసెంబర్‌ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌లో భాగంగా షెడ్యూల్‌ ప్రకారం అన్ని మ్యాచ్‌లు బంగ్లా రాజధాని ఢాకాలోనే జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్‌ 10న జరగనున్న మూడో వన్డే వేదికను మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్‌కు మార్చినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) బుధవారం పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) డిసెంబర్‌ 10న  వేలాది మందితో ఢాకా వీదుల్లో ర్యాలీతో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే అదే రోజు డాకాలో మూడో వన్డే జరగాల్సి ఉంది. దీంతో​ అల్లర్లకు ఆస్కారం ఉండడంతో వన్డే వేదికను మార్చాలని బీసీబీ నిర్ణయించుకుంది. అందుకే డిసెంబర్‌ 10న జరగనున్న మూడో వన్డేను డాకాలో కాకుండా చిట్టగాంగ్‌ వేదికగా జరుగుతుందని తెలిపింది. ఇక గత నెలలో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఎన్‌పీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీఎన్‌పీ కోరుతుంది.

ఇక మొదటగా అనుకున్న ప్రకారం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు డాకా, చిట్టగాంగ్‌లు వేదికలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని బీసీబీ ఆపరేషన్స్‌ చీఫ్‌ జలాల్‌ యునస్‌ తెలిపారు. డిసెంబర్‌ 4,7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. డిసెంబర్‌ 14-18 వరకు చిట్టగాంగ్‌ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్‌ 22-26 వరకు డాకా వేదికగా రెండో టెస్టు జరగనుంది.

చదవండి: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా!

బంగ్లాతో టెస్టు సిరీస్‌.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top