
బ్రిడ్జ్టౌన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆ్రస్టేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... తొలి టెస్టు కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) శుక్రవారం జట్టును ప్రకటించింది.
స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో తొలి టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇన్గ్లిస్, టీనేజ్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్కు అవకాశం దక్కింది. ఇటీవల లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఆస్ట్రేలియా పరాజయం పాలవడంతో...
సెలెక్టర్లు జట్టులో మార్పులు చేశారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ స్మిత్ కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. రెండో టెస్టు వరకు అతడు జట్టులో చేరొచ్చు. లబుషేన్, స్మిత్ స్థానాలను కొన్స్టాస్, ఇన్గ్లిస్ భర్తీ చేస్తారు. టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొన్స్టాస్ అరంగేట్ర పోరులోనే హాఫ్సెంచరీతో ఆకట్టుకుంటే... శ్రీలంక పిచ్లపై టెస్టు అరంగేట్రం చేసిన ఇన్గ్లిస్ తొలి మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కాడు. లబుషేన్ జట్టులో కీలక ఆటగాడే అయినా ... అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేకపోవడంతోనే జట్టు నుంచి తప్పించాం. అతడు తిరిగి సత్తా చాటుతాడనే నమ్మకముంది’అని చీఫ్ సెలెక్టర్ బెయిలీ అన్నాడు.