
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు భారీ షాక్ తగిలింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మహిళా అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు అతని మ్యాచ్ ఫీజ్లో 30 శాతం కోత విధించారు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినందుకు 10 శాతం.. పరికరాల దుర్వినియోగానికి పాల్పడినందుకు (బ్యాట్) 20 శాతం జరిమానా విధించారు. ఈ విషయమై మ్యాచ్ రిఫరీ అశ్విన్ను విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
అశ్విన్కు ఇలాంటివి కొత్త కాదు
అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న అశ్విన్కు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలో చాలా సార్లు మ్యాచ్ రిఫరీల చేత అక్షింతలు వేయించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా దేశవాలీ క్రికెట్లోనూ తన దురుసు ప్రవర్తనతో వార్తల్లోకెక్కేవాడు. ఏదైన విషయంలో అశ్విన్ తన అసంతృప్తిని గట్టిగా వ్యక్తం చేసేవాడు.
అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో అశ్విన్ దిండిగల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (జూన్ 8) ఐడ్రీమ్ తిరుప్పుర్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్ ప్యాడ్లకు తాకింది.
దీంతో సాయి కిషోర్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ మారు ఆలోచించకుండా అశ్విన్ను ఔట్గా ప్రకటించింది. దీంతో అశ్విన్ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు.
అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను తన ప్యాడ్కు కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. అశ్విన్కు రివ్యూ కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పటికే ఆ జట్టు రెండు రివ్యూలను వినియోగించుకుంది.
ఈ మ్యాచ్లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ జట్టు దిండిగుల్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.