
బెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) జంట 6–2, 6–4తో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది.
ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు భారతీయ ప్లేయర్లు డబుల్స్ చాంపియన్స్గా నిలిచారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అనిరుద్–రే హో జంట నెట్ గేమ్తో చెలరేగింది.
తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న అనిరుధ్ జంట... రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గకుండా విజయం ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రూ.8.65 లక్షల నగదు బహుమతితో పాటు... 125 ర్యాంకింగ్ పాయింట్లు అనిరుధ్ జోడీ ఖాతాలో చేరాయి.