ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు.
దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు.
ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ను కూడా న్యూజిలాండ్తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్కు కూడా దూరంగా ఉన్నాడు.
చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం!


