నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక | Sakshi
Sakshi News home page

నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక

Published Fri, Jun 2 2023 7:08 PM

609 Students From Andhra Pradesh Selected For 66th National School Games - Sakshi

సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో  పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్‌లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. 

 పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు.  జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు.

రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్‌ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి  ప్రకటించారు. 

Advertisement
Advertisement