77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్‌, బుమ్రా! | 1st Time In 77 Years: India Australia Clinch Never Seen Before Feat In Perth Test | Sakshi
Sakshi News home page

77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్‌, బుమ్రా!

Nov 22 2024 11:00 AM | Updated on Nov 22 2024 1:18 PM

1st Time In 77 Years: India Australia Clinch Never Seen Before Feat In Perth Test

ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్‌ టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్‌ కమిన్స్‌- జస్‌ప్రీత్‌ బుమ్రా కలిసి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

రోహిత్‌ శర్మ  దూరం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో టీమిండియాకు ఈ సిరీస్‌ ఆఖరిది. ఇక ఇందులో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్‌ ఈసారీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలకమైన సిరీస్‌లో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నాడు.

బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు
ఈ క్రమంలో రోహిత్‌ స్థానంలో భారత జట్టు పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్‌ వేదికగా టీమిండియా- ఆసీస్‌ మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్‌ సమయంలో కెప్టెన్లు బుమ్రా- కమిన్స్‌ కరచాలనం చేసుకున్న దృశ్యాలు క్రికెట్‌ ప్రేమికులను ఆకర్షించాయి.

77 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
ఈ నేపథ్యంలోనే భారత్‌- ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్‌ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరుజట్లకు ఫాస్ట్‌బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా 2021 ద్వితీయార్థంలోనే ఫాస్ట్‌ బౌలర్‌ కమిన్స్‌ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ అయ్యాడు.

మరోవైపు.. భారత పేసర్‌ బుమ్రా గతంలో ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆస్ట్రేలియాలో మాత్రం సారథిగా అతడికి ఇదే తొలి అనుభవం. ఇదిలా ఉంటే.. 1947-48లో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్టు సిరీస్‌ జరిగింది. 

నాడు వీరి సారథ్యంలో
నాడు టీమిండియా ఆసీస్‌ చేతిలో 4-0తో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్‌ జట్టుకు లెజెండరీ బ్యాటర్‌ సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ కెప్టెన్‌గా ఉండగా.. టీమిండియాకు ఆల్‌రౌండర్‌ లాలా అమర్‌నాథ్‌ నాయకుడు.

ఇక 1985-86లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఇంత వరకు బుమ్రాలా పూర్తిస్థాయిలో ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించలేదు.

పేలవంగా మొదలు
కాగా పెర్త్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ బుమ్రా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు మాత్రం శుభారంభం లభించలేదు. శుక్రవారం నాటి తొలిరోజు ఆట భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది.

చదవండి: Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్‌.. కోహ్లి మరోసారి విఫలం.. మండిపడుతున్న ఫ్యాన్స్‌
టాలెంటెడ్‌ కిడ్‌.. ఇక్కడ కూడా.. : నితీశ్‌ రెడ్డిపై కమిన్స్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement